భారత స్టార్ బ్యాట్స్ మెన్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మలను తమ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వదిలించుకున్నాయి. ఐపీఎల్ సీజన్-9కు ఆటగాళ్ల వేలం దగ్గరపడుతున్న దశలో పలు ఫ్రాంఛైజీలు భారంగా మారిన ఆటగాళ్లకు స్వస్తి పలికాయి. గత సీజన్ లో అత్యధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అతనిని వదులుకుంటున్నట్టు ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము ఆయనను వదులుకుంటున్నట్టు డీడీ ప్రకటించింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు వీరేంద్ర సెహ్వాగ్ ను డ్రాప్ చేస్తున్నట్టు పేర్కొంది. గత సీజన్ లో ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన వీరిద్దరూ పేలవ ప్రదర్శనతో ఫ్రాంఛైజీలను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మను వదిలేసింది. ఇక వీరిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
ఇక్కడ తిరిగి ఫాంలోకి వచ్చి భారత టీ-20 జట్టులో స్థానం సంపాదించుకున్నప్పటికీ, ఢిల్లీ ఐపీఎల్ జట్టుకు మాత్రం యువరాజ్ దూరమవ్వటం గమనార్హం. ఐపీఎల్ 9వ సీజన్ లో యువరాజ్ తో పాటు లంక ఆటగాడు మాథ్యూస్ ను వదిలించుకుంటున్నట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్రకటించింది. గత వేలంలో రూ. 16 కోట్లు పలికిన యువీ ఢిల్లీని నిరాశకు గురి చేస్తూ, కేవలం 248 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యువరాజ్ ను వదులుకోవడం వల్ల తమ కిట్టీలో రూ. 16 కోట్లు మిగిలాయని, ఆ డబ్బుతో వేరే ఆటగాళ్లను కొనే ప్రయత్నం చేస్తామని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి హేమంత్ వివరించాడు. మొత్తం మీద ఇద్దరు ఆటగాళ్లను తొలగించి రూ. 23 కోట్లు ఆదా చేశామని తెలిపాడు. కాగా, ఈ సంవత్సరం వివిధ ఫ్రాంచైజీల నుంచి మొత్తం 61 మంది విడుదల కాగా, బెంగళూరు జట్టు అత్యధికంగా 14 మందిని తొలగించింది. వచ్చే నెల 6న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది.