భారత జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మాంచెస్టర్ లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు క్రికెట్ పోటీలో ధోనీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అప్పట్లో జట్టుకు మేనేజర్ గా ఉన్న సునీల్ దేవ్ వ్యాఖ్యానించినట్టు ఓ ప్రముఖ దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ముందుగా జట్టు తీసుకున్న నిర్ణయాన్ని కాదని, టాస్ గెలిచిన ధోనీ, తరువాత అకస్మాత్తుగా బౌలింగ్ ఎంచుకోవడం వల్లే భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని సునీల్ చెప్పినట్టు దాని సారాంశం.
దీంతో సదరు పత్రికపై భారీ పరిహారం కోరుతూ కేసు వేసేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు ప్రచురించిన సదరు పత్రికకు 9 పేజీల నోటీసు పంపినట్టు ధోనీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ధోనీపై అలాంటి వ్యాఖ్యలు తాను ఎన్నడూ చేయలేదని సునీల్ ఆ వార్తను ఖండించాడు కూడా. దీంతో పత్రిక అసత్య కథనంతో ఇరకాటంలో పడినట్లయ్యింది.