సయ్యద్ ముస్తక్ ఆలీ టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ-బరోడా మ్యాచ్లో ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు . టి-20 ట్రోఫీలో రేర్ ఫీట్ సాధించిన ఘనత ఇతనికి దక్కింది. ఇప్పటివరకూ ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ పేరిట ఉంది. 2012లో జరిగిన ఓ మ్యాచ్లో ఒకే ఓవర్లో 38 పరుగులు కొట్టిన ఘనత ఇతని సొంతం. ఇతని తర్వాత హార్ధిక్ పాండ్యా ఆ ఫీట్ ను సాధించాడు. 5 సిక్స్ లు, ఒక ఫోర్తో 34 పరుగులు చేశాడు. వీటికి తోడు ఒక నోబాల్, నాలుగు బైస్తో కలిపి మొత్తం 39 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ప్రత్యేకంగా ఢిల్లీ మీడియం పేసర్ అకాశ్ సుడాన్ వేసిన 19.0 ఓవర్ లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు సాధించాడు. కాగా, అకాశ్ సుడాన్ నాలుగు బైలు, ఒక నోబాల్ తో మొత్తం 39 పరుగులిచ్చి ట్వంటీ 20 లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీంతో గతంలో ట్వంటీ 20 ఫార్మెట్ లో న్యూజిలాండ్ బౌలర్ స్కాట్ స్టారిస్ ఒకే ఓవర్ లో 38 పరుగులిచ్చిన చెత్త రికార్డు చెరిగిపోయింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా పాండ్యా 51 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో పాండ్యా రాణించినా బరోడాకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు నమోదు చేసిన పలువురు క్రికెటర్ల సరసన చేరే అవకాశాన్ని పాండ్యా తృటిలో కోల్పోయాడు. అంతకుముందు వివిధ ఫార్మెట్లలో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో సర్ గార్లీఫీల్డ్ సోబర్స్(1968), రవిశాస్త్రి(1985), హెర్షలీ గిబ్స్(2007), యువరాజ్ సింగ్(2007), అలెక్స్ హేల్స్(2015)లు ఉన్న సంగతి తెలిసిందే.