క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ, పొట్టి ఫార్మట్ తో ఫ్యాన్స్ను అమితంగా ఆకట్టుకుంటోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ను ఇక మనదేశంలో చూడలేకపోవచ్చు. వచ్చే ఏడాది నుంచి మరో దేశంలో జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది. ఇప్పటికే విదేశీ వేదికల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఐపీఎల్ అంశంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ... గవర్నింగ్ కౌన్సిల్ విదేశీ వేదికలను పరిశీలిస్తోందని చెప్పారు. విదేశాల్లో ఐపీఎల్ వేదికల అంశంలో అక్కడి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారని తెలిపారు.
భారత్లో నిర్వహిస్తోన్న ఐపీఎల్ ప్రతీసారి ఏదో ఒక అంశంతో సమస్యల్లో పడుతోంది. మహారాష్ట్రలో ఏర్పడిన కరవుతో ఈ సీజన్ ఐపీఎల్లో 12 మ్యాచ్లను మరో చోటికి తరలించారు. గత సీజన్లలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురైన విషయం తెలిసిందే. గతంలో 2009, 2014 సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ టోర్నీలను దక్షిణాఫ్రికా, యూఏఈలో(కొన్ని మ్యాచ్లు)లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇది పూర్తిస్థాయా లేక వచ్చే ఏడాదికి మాత్రమేనా అన్న విషయంపై స్పష్టత లేదు.