ఐపీఎల్ వల్ల భారత క్రికెట్ సర్వ నాశనం అయిపోతుందని ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ తీరు తనకు బాధను, నిరాశను కలిగిస్తోందని, క్రికెటర్లు 20 ఓవర్ల ఫార్మాట్ కు బానిసలుగా మారారని క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా ఐపీఎల్ ను తొలగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. గతంలో ఇండియా - ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఆడుతుంటే చూసేందుకు ఎంతో ఆసక్తి ఉండేదని, ఇప్పుడది పూర్తిగా పోయిందని అన్నారు.
తాజాగా రెండు టెస్టు సిరీస్ లలో ఇండియా జట్టు 4-0, 3-1 తేడాతో ఇంగ్లండ్ పై ఓటమి పాలైందని గుర్తు చేస్తూ, భారత టెస్టు క్రికెట్ దయనీయ పరిస్థితుల్లోకి నెట్టి వేయబడిందని, దీనిపై స్వీయ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు. క్రికెట్ మజా టెస్టు మ్యాచ్ లలోనే ఉంటుందన్న ఇయాన్, దాన్ని మరచిన భారత ఆటగాళ్లు 20 ఓవర్ల ఆట మాత్రమే క్రికెట్ అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. టీ20 మత్తు నుంచి బయటపడితేనే భారత క్రికెట్ బతుకుతుందని ఆయన సలహా ఇస్తున్నాడు.