టీమిండియా తరపున ఒకే రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అరుదైన రికార్డు సాధించారు. వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో మైలు రాయిని అందుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో 200 సిక్సర్లు కొట్టిన కెప్టెన్గా ధోని రికార్డు సాధించాడు. ఇంతకముందు ఏ కెప్టెన్ కూడా ఈ అరుదైన ఘనతను సాధించలేదు. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ధోని ఈ రికార్డుని సాధించాడు. హార్ధిక్ పాండ్యా ఔట్ అయిన తర్వాత 6వ స్ధానంలో బ్యాటింగ్కు దిగిన ధోని లంక బౌలర్ మిలింద సిరివదర్దన వేసిన ఓవర్లో 200వ సిక్స్ను పూర్తి చేశాడు. దీంతో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్ధానంలో ఆస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (171)తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బ్రెండన్ మెక్ కల్లమ్(170), క్రిస్ గేల్(134), సౌరవ్ గంగూలీ(132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ కూడా టీ20ల్లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది కోహ్లీ బ్యాటింగ్ సగటు వంద దాటింది. శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి సగటు 103.66కు చేరింది. ట్వంటీ 20ల్లో శ్రీలంకపై మూడో అర్ధ సెంచరీ చేసిన కోహ్లి గత ఆరు ఇన్నింగ్స్లో నాలుగు అర్ధ సెంచరీలతో 311 పరుగులు సాధించాడు.