పొట్టి ఫార్మట్ వరల్డ్ కప్ కు ముందు బోలెడన్ని ఆశల భారాన్ని మోసుకుంటూ బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన టీమిండియా ఆసియా కప్లో తొలి పోరాటానికి రెడీ అయింది. బుధవారం ఇక్కడ మొదలయ్యే ఈ మ్యాచ్లో ఆతిథ్య బంగ్లాదేశ్తో టైటిల్ ఫేవరెట్ టీమిండియా తలపడనుంది. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్నకు చివరి సన్నాహకంగా భావిస్తున్న ఈ మెగా టోర్నీలో సత్తాచాటాలని ధోనీసేన భావిస్తోంది. అయితే సోమవారం జరిగిన ప్రాక్టీస్ సందర్భంగా ధోనీ గాయపడడం భారతను ఆందోళనకు గురిచేస్తోంది.
బంగ్లాతో మ్యాచ్లో మహీ బరిలోకి దిగేది అనుమానంగా మారింది. ఇక బంగ్లా విషయానికొస్తే మష్రఫె మోర్తజా నేతృత్వంలోని యువకులు, అనుభవజ్ఞులతో కూడిన జట్టు సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. పైగా గత బంగ్లా పర్యటనలో ధోనీసేన ఓడించిన అనుభవం వారిలో మరింత జోష్ను నింపుతోంది. కానీ.. ఆస్ర్టేలియా, శ్రీలంకపై వరుస సిరీ్సలు నెగ్గి జోరుమీదున్న భారత ఇక్కడా అదే ఫామ్ను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. తద్వారా గతేడాది బంగ్లా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.