దంచి కొట్టుడు ఆటగాళ్లకు విండీస్ ప్లేయర్లు పెట్టింది పేరు. అలాంటిది గేల్ మెరుపులు లేకుండా టీ20 ప్రపంచకప్ చూడటమనేది అస్సలు ఊహించుకోలేనిది. అయితే వెస్టిండీస్ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య తలెత్తిన కాంట్రాక్టు వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. దీంతో భారత్ వేదికగా వచ్చే నెల 8న మొదలవనున్న టీ20 ప్రపంచకప్లో విండీస్ ప్రాతినిధ్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంట్రాక్టుపై సంతకం పెట్టేలా ఆటగాళ్లకు ఆదివారం వరకు బోర్డు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు కాంట్రాక్టు విధానానికి అంగీకరిస్తూ మొత్తం 12 మంది క్రికెటర్లు సంతకాలు చేశారు. ఇందులో కెప్టెన్ సమీతో పాటు గేల్, సిమ్మన్స్, రస్సెల్, శామ్యూల్స్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. పనిలో పనిగా జట్టును కూడా బోర్డు ప్రకటించేసింది. అంటే త్వరలో భారత్ లో జరిగే టోర్నీలో కరేబియన్ల ధనాధన్ చూడొచ్చన్నమాట. ప్రపంచకప్కు వెస్టిండీస్ జట్టు: సమీ(కెప్టెన్), సులేమాన్, హోల్డర్, ఫ్లెచర్, డ్వేన్ బ్రావో, బద్రీ, సిమ్మన్స్, టేలర్, రస్సెల్, శామ్యూల్స్, రామ్దిన్, గేల్, అశ్లే నర్స్, బ్రాత్వైట్.