తనపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చేసిన ఆరోపణలకు సీనియర్ రాజకీయ నేత, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ఎంసీఏ చరిత్రలో బెస్ట్ స్కోరు చేసింది తానోక్కడినే అని ఆయన చెప్పారు. 'అభివృద్ధి కోణంలో చూస్తే వాంఖడే మైదానం నిర్మించి దివంగత ఎస్ కే వాంఖేడ్ మొదటి సెంచరీ సాధించారు. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక బాంద్రా కర్లా ఇండోర్ అకాడమీ ఏర్పాటు చేశాం. ఇదే రకమైన సౌకర్యాలు కాందవలి, థానేల్లో కల్పించాం. వీటిని గనుక పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద నేను మూడు సెంచరీలు సాధించినట్టు లెక్క. ఇదీ మా స్కోరు' అని శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శరద్ పవార్ వెలగబెట్టింది ఏం లేదని, ఆయన స్కోర్ జీరో అని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ క్రికెటర్లు రిటైరయ్యారు కానీ శరద్ పవార్ మాత్రం ఇంకా ఎంసీఏను పట్టుకుని వేలాడుతున్నాడని థాక్రే ఎద్దేవా చేశారు. 14 ఏళ్లుగా వరుసగా ఎంసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరద్ పవార్ ప్రస్తుతం మరోసారి ఎంసీఏ బోర్డు ఎన్నికలకు మరోదఫా పోటీచేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే థాక్రే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.