విద్యార్థుల భవిషత్తును నిర్దేశించే ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ ఫలితాలు మరికాస్సేపట్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిపి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. కాకినాడలోని జెఎన్టియు సెనేట్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి ఎపి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి, జెఎన్టియుకె వైస్ ఛాన్సలర్, ఎంసెట్-2015 ఛైర్మన్ ఆచార్య విఎస్ఎస్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. ఎపి ఎంసెట్-2015ను ఈనెల 8న తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీని ఈనెల 10వ తేదీన జెఎన్టియుకె విడుదల చేసింది. ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం ఫలితాలను ఈనెల 26న ప్రకటించాల్సి ఉంది. అయితే నిర్దేశించిన సమయం కంటే ఐదు రోజులు ముందుగా ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. జెఎన్టియుకెలో సుశిక్షితులైన అధికారులు, నిపుణులు ఉండటం, వర్సిటీ అన్ని రకాల వనరులను కలిగివుండడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఫలితాలు వెల్లడించడానికి అవకాశం కలిగిందని ఎంసెట్-2015 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబా చెప్పారు.