ఆకతాయిలను ఉతికి ఆరేశారు

December 01, 2014 | 10:35 AM | 22 Views
ప్రింట్ కామెంట్

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న అబలలకు ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. అయితే, హర్యానాలోని ఇద్దరు అక్కచెల్లెలు మాత్రం ఈవ్ టీజింగ్ పాల్పడితే మౌనంగా భరించే వాళ్లం కాదంటూ నిరూపించారు. తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకున్నా బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలకు బుద్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. వారి చేష్టలకు కుంగిపోకుండా ధైర్యంగా వారిని ప్రతిఘటించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. రోహ్తక్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు రోజూలాగే శుక్రవారం కాలేజీకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కగా వారు కూర్చున్న సీట్ల వెనక నిలబడిన ముగ్గురు పోకిరీలు వేధించడం మొదలుపెట్టారు. కాగితాలు చింపి విసరడం, అసభ్య చేష్టలు ప్రారంభించారు. యువతులు ఎదురు తిరగడంతో ఆగ్రహించిన పోకిరీల్లో ఒకడు ఒక యువతిపై దాడి చేశాడు. మరో ఇద్దరు పోకిరీలు రెండో యువతిని గట్టిగా పట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా బస్సులోని ప్రయాణికులెవరూ ఆకతాయిలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఎలాగోలా అక్కాచెల్లెళ్లిద్దరూ ధైర్యాన్ని కూడదీసుకొని ఆకతాయిలపై ఎదురుతిరిగారు. పోకిరీలపై పిడిగుద్దులు కురిపించారు. ఒక యువతి ఏకంగా తన బెల్టు తీసి ఓ పోకిరీని చితక్కొట్టింది. అయితే బస్సు ఆగడంతో పోకిరీలు ఆ యువతులను బస్సులోంచి తోసేశారు. అనంతరం కాన్ల్సా అనే గ్రామంలో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. నిందితులపై బాధిత యువతుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని కుల్‌దీప్, మోహిత్, దీపక్‌లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ శశాంక్ ఆనంద్ తెలిపారు. మరోవైపు ఈ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పంచాయతీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని యువతుల తండ్రి చెప్పారు. బస్సులో అంత జరుగుతున్న అడ్డుకోడానికి కనీసం పోలీసులకు సమాచారం అందించడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన వాపోయారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ