దీదీ పేరు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు

December 17, 2014 | 10:44 AM | 30 Views
ప్రింట్ కామెంట్

శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టైన పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తోనే తనను సీబీఐ అరెస్ట్ చేసిందని ప్రకటించిన ఆయన, తాజాగా సీబీఐ దర్యాప్తు జరుపుతున్న తీరుపై కీలక ఆరోపణలు చేశారు. మంగళవారం అలీపూర్ కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి పాత్ర ఉందని చెప్పాలంటూ సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదు రోజులుగా తనను విచారిస్తున్న సీబీఐ అధికారులు ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా తనను అడగలేదని చెప్పిన ఆయన, 24 గంటల పాటు తన చుట్టూ నిలబడుతున్న సీబీఐ అధికారులు తనను ఒత్తిడికి లోను చేస్తున్నారని ఆయన చెప్పారు. కుంభకోణంలో తన పార్టీ నేతల ప్రమేయం ఉందని చెప్పాలని బలవంతపెడుతున్న సీబీఐ అధికారులు, మమతా బెనర్జీకీ ఇందులో పాత్ర ఉందని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను దర్యాప్తునకు సహకరిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశాడు. తాను కోర్టు విధించే ఏ శిక్షకైనా సిద్ధమని, అంతేగానీ సీబీఐ కస్టడీకి మాత్రం విధించోద్దని కోరాడు. విచారణ పేరిట సీబీఐ అధికారులు తనను మానసికంగా చంపేస్తారని ఆరోపించారు. అయితే వాదోపవాదనలు ముగిసిన అనంతరం కోర్టు బెయిల్ నిరాకరించటంతోపాటు ఆయన కస్టడీని 19వరకు పొడిగించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ