ప్రమాదం మరో ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అనంతపురం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మృతిచెందారు. గ్రానైట్ లోడ్ తో వెళుతున్న ఓ లారీ బ్రేకులు ఫెయిలవ్వటంతో అదుపు తప్పి పెనుగొండ మండలం మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ హెచ్1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ప్రమాదంలో బోగిలో ఉన్న కర్ణాటక రాయ్ చూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్నాయక్ కూడా చనిపోయారు. లారీ ఎస్ 1 బోగిని డీకోట్టడంతోపాటు మరో రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో హెచ్1 బోగి ఏసీ టెక్నిషియన్ అహ్మద్ ఉన్నాడు. కాగా, ఈ ప్రమాదం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టరు, ఎస్పీలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశంతో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో పలు రైళ్లలకు అంతరాయం కలిగింది. ప్రమాద శకలాలను తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే పార్ధసారధిలు పరిశీలించారు. ప్రయాణికులకు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు, ఎస్పీలను మంత్రి సునీత ఆదేశించారు. స్వల్పంగా గాయపడిన వారికి ఘటనాస్థలంలోనే చికిత్స జరిపారు. మిగతా రైలు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు జిల్లా అధికారులు 22 బస్సులు ఏర్పాటు చేశారు.