మందలించిన మాష్టారును మర్డర్ చేశారు

December 19, 2014 | 04:05 PM | 29 Views
ప్రింట్ కామెంట్

ఝార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్ భమ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టీచర్ ను హత్య చేశారు. అతడి వద్ద ఉన్న నగదు దోచుకున్నారు. తుంగ్రి మొహల్లా ప్రాంతంలోని సెయింట్ జేవియర్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఈ హంతక విద్యార్థులు వ్యసనాలకు బానిసలయ్యారు. సిగరెట్లు, మద్యం మానేయాలని, లేకుంటే, వారి తల్లిదండ్రులకు చెబుతానని సదరు టీచర్ జాస్లిన్ టొప్నో ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఈ ముగ్గురిలో ఓ విద్యార్థి టొప్నో ఉండే భవనంలోనే ఓ అద్దె గదిలో ఉంటున్నాడు. మిగతా ఇద్దరూ తరచు ఆ గదికి వచ్చేవారు. తమను హెచ్చరిస్తున్న ఆ ఉపాధ్యాయుడిని చంపి, అతడి వద్ద ఉన్న నగదుతో బైక్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఓ మిత్రుడిని తుపాకీ ఇమ్మని అడగ్గా, అతడు నిరాకరించాడు. దీంతో, గొడ్డలితో చంపాలని నిశ్చయించుకున్నారా ముగ్గురు మిత్రులు. టీచర్ గదిలోకి ప్రవేశించి అతడిపై గొడ్డలితో దాడి చేశారు. అక్కడే ఉన్న మరో విద్యార్థిని కూడా చంపేందుకు ఈ త్రయం ప్రయత్నించింది. అయితే, ఆ బాలుడు తప్పించుకుని స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో, ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అప్పటికే నిందితుల్లో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని నిందితుల్లో ఒకరిని పట్టుకుని, తమదైన శైలిలో విచారించగా, మిగతా ఇద్దరి ఆచూకీ బయటపడింది. అనంతరం వారిని కూడా అరెస్టు చేశారు. కాగా, వారు తుపాకీ అడిగిన మిత్రుడి ఇంటిపై పోలీసులు దాడి చేయగా, అక్కడ వారికి రెండు దేశవాళీ పిస్టళ్లు, ఒక ఎయిర్ గన్, రెండు లైవ్ కార్ట్రిడ్జ్ లు లభ్యమయ్యాయి. దీంతో, ఆ బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ