చైన్ స్నాచర్లకు బుల్లెట్ దింపుతారట!

October 15, 2015 | 12:12 PM | 6 Views
ప్రింట్ కామెంట్
shoot-at-sight-for-Chain_snatchers-in-hyderabad-telangana-niharonline

భాగ్యనగరంలో చైన్ స్నాచర్ల హవా ఏపాటిదో మనకు తెలిసిన విషయమే. కనురెప్పపాటులో వచ్చి మహిళల మెడలో గోలుసును లాక్కెళ్లే వీళ్లు ఖాకీలను ముప్పుతిప్పులు పెడుతున్నారు. లోకల్ గానే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బ్యాచ్ బ్యాచ్ లుగా తిష్ఠ వేశారు. జంట నగరాల్లో బైకులపై దూసుకొచ్చి మహిళలపై యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు. ఒకవేళ మహిళలు ప్రతిఘటిస్తే దాడులకు సైతం వెనకాడని కర్కశులు ఉంటారు. ఇక ఇలాంటి వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైపోయారు హైదరాబాద్ పోలీసులు.   

చైన్ స్నాచర్ల విషయంలో ఇకపై మరింత కఠినతరంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట. ఇకపై చైన్ స్నాచర్లు కనిపిస్తే కాల్చి వేస్తామని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. బుధవారం ఇరానీ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబరాబాదు పోలీసులు పట్టేశారు. తప్పించుకున్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన ఇకపై చైన్ స్నాన్చర్లను వదిలే ప్రసక్తే లేదని,  అవసరమైతే కాల్చాలని అధికార ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు.

ఇక తప్పించుకుని తిరుగుతున్న ఇరానీ గ్యాంగ్ సభ్యుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. పట్టుబడ్డ ముగ్గురు స్నాచర్ల నుంచి కిలో బంగారు ఆభరణాలతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతోనైనా ఈ గ్యాంగ్ ల ఆగడాలు తగ్గితే చాలా మంచిదని మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారట. తేడా వస్తే చావుబాజేనని అర్థమైతే వారు కూడా గప్ చుప్ అయిపోతే క్రైం రేట్ తగ్గిపోతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ