శ్రీకాకుళం కిలాడీ కటకటాల వెనక్కి...

October 14, 2015 | 03:00 PM | 3 Views
ప్రింట్ కామెంట్
woman-cheated-many-marriages-in-hyderabad-niharonline

మోసాలకు పాల్పడటం మగాళ్ల పేటెంట్ రైట్ ఏం కాదు. దారుణమైన మోసాలకు పాల్పడి డబ్బులు లాగే ఆడాళ్లు సోసైటీ లో చాలా మందే ఉన్నారండీ. కానీ, ఇక్కడ మనమో ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పుకుందాం. ఈవిడగారు కాస్త డిఫరెంట్. డబ్బులున్న వ్యక్తి కనిపిస్తే చాలు... పేరు మార్చుకుని అతని ముందు వాలిపోయి, పెళ్లి పీటలు ఎక్కించి ఆపై మోసం చేయడం ఈవిడగారి నైజం. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురిని పెళ్లాడింది. అంతేకాదు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నని చెప్పి, ఉద్యోగాల పేరిట పలువురి దగ్గరి నుంచి డబ్బు దండుకుంది కూడా.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు, రాణి, బుజ్జి, లేఖ్యారెడ్డి, హేమలత... ఇలా ఎన్నో పేర్లు మార్చింది. ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆమె, మొదట ఎల్బీ నగర్‌ కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త వేధిసున్నాడంటూ ఎల్బీ నగర్ స్టేషన్‌ లో కేసు పెట్టింది. ఆపై బోరబండకు వచ్చి జగదీష్ అనే వ్యక్తిని, తరువాత పూర్ణచందర్ ను, నాలుగో పెళ్లిలో కరీంనగర్‌ కు చెందిన కిశోర్‌ ను వివాహం చేసుకుంది. వీరందరిపైనా వేధింపుల కేసులు పెట్టి వదిలించుకుంది.

ఈవిడగారి అకృత్యాలు అంతటితో ఆగక తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. చివరికి ఆస్తి కోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే ఆమెపై అనుమానంతో పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడి అడ్డంగా దొరికిపోయింది. ఈ కిలాడీ లేడీపై వివిధ పోలీసు స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయని, ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టామని పోలీసులు వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ