భారత క్రికెట్ జట్టు సభ్యుడు అజింక్య రహానేకు అరుదైన గౌరవం లభించింది. క్రీడా రంగానికి అతను చేసిన సేవలకు గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో సభ్యత్వం కోసం వందలాది మంది క్రీడా ప్రముఖులు, వీఐపీలు ఎదురుచూస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్లబ్ లో రహానే కు అతని భార్య రాధికకు జీవితకాల సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్ లో రహానే దంపతులకు గౌరవ సభ్యత్వం ఇస్తున్నట్లు క్లబ్ ప్రకటించింది. ఇక దక్షిణ ముంబైలోని ఈ క్లబ్ అందించే సౌకర్యాలను రహానే జీవితాంతం వాడుకోవచ్చు. కాగా, త్వరలోనే హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, ఆమె భర్త షోయబ్ మాలిక్ కు సీసీఐ సభ్యత్వం దక్కనుంది. త్వరలోనే ఓ వేడుకను నిర్వహించి వీరికి సభ్యత్వం ఇవ్వాలని సీసీఐ ఆఫీస్ బేరర్లు భావిస్తున్నారని తెలుస్తోంది.