బోర్డు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉండటమే ఆయన ఫ్లస్ అయ్యింది. అదే ఆయన్ను రెండోసారి బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టేలా చేసింది. వివాదరహితుడు కాబ్టటే సభ్యులంతా ఆయనకే ఓటు వేసి పట్టం కట్టారు. ఆయనే శశాంక్ మనోహర్. 2005 నుంచి బోర్డు కార్యకలాపాల్లో ఉన్న ఆయన రెండోసారి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం పెద్ద ఆశ్చర్యం కలిగించేది కాకపోయినా... పోటీకి దిగుతారనుకన్న వారు ఆయన ముందు డంగైపోవటం ఇప్పుడు ప్రత్యేకం. అలాంటి వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు... ఈ కాలంలో కూడా సెల్ఫోన్ వాడని, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వంక కూడా చూడని వ్యక్తి శశాంక్. సొంత ఈ-మెయిల్ అకౌంట్ కూడా లేదు. నాగ్పూర్లో ప్రముఖ లాయర్ అయిన మనోహర్తో మాట్లాడాలనుకుంటే ఇంట్లో లేదా ఆఫీసులో ఉండే లాండ్లైన్ ఒక్కటే ఆధారం. 2008-11 వరకు మూడేళ్లు అధ్యక్షుడిగా పనిచేసినా.. ఒక్క వివాదం కూడా రాలేదు.
సంక్లిష్ట సమయాల్లో తన చతురత, అనుభవంతో బోర్డును ఒడ్డునపడేశాడు. అంతేకాకుండా ఆటగాళ్ల అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా శశాంక్ గుర్తింపు పొందాడు. ఆర్థిక అవకతవకల కారణంగా ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీని సస్పెండ్ చేయడం అధ్యక్షుడిగా మనోహర్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. శశాంక్ హయాంలోనే భారత్ రెండోసారి ప్రపంచ కప్ సాధించింది. ఆటగాళ్ల ప్రైజ్ మనీని రూ. కోటి నుంచి అమాంతంగా రెండు కోట్ల రూపాయలకు పెంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2013లో ఐపీఎల్ స్కామ్ బయటపడినప్పుడు శ్రీనివాసన్ తప్పుకోవాలని మొదట డిమాండ్ చేసింది మనోహరే. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే బోర్డు 36వ అధ్యక్షుడిగా మనోహర్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు.