ఢిల్లీలో చిన్నారులపై పైశాచికం... పరిస్థితి సీరియస్!

October 17, 2015 | 12:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
2-minors-gang-raped-in-delhi-both-critical-niharonline

దేశ రాజధాని ఢిల్లీలో అమానుషమైన రెండు ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మైనర్ బాలికలపై వరుస అత్యాచార ఘటనలు జరగటం ఇప్పుడు అక్కడ భద్రతను ప్రశ్నించేలా ఉన్నాయి. వారం క్రితం ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిని బలవంతంగా క్యాబ్ లో అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మరువక ముందే ఇలాంటివే మరో రెండు ఘటనలు వెలుగుచూశాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు పసికందులపై అఘాయిత్యాలు వెలుగుచూడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం ఈ వార్తలు అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరు బాలికలు కూడా తీవ్ర గాయాలతో బయటపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

కాగా మొద‌టి సంఘ‌ట‌న ప‌శ్చి‌మ ఢిల్లీ‌లో చోటుచేసుకుంది. న‌న్‌గ్లో‌యి ప్రాంతంలో ఇంటిబయట ఆడుకుంటున్న రెండున్నర సంవత్సరాల పాపను ఇద్దరు దుండగులు అప‌హ‌రించి, అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాప కనిపించకపోవటంతో వెతికిన తల్లికి పక్కన పోదలో పడి ఉన్న కూతురు కనిపించింది. ఒంటిపై గాయాల‌తో, తీవ్ర‌ ర‌క్త స్రావంతో ఉండటంతో స్థానికుల సాయంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి శస్త్ర చికిత్స చేశామని అయినా రక్తస్రావం ఆగట్లేదని వైద్యులు చెబుతున్నారు. దీనిని బట్టి ఆ రాక్షసులు ఎంత కిరాతకానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.

ఇక మ‌రో సంఘ‌ట‌న తూర్పు ఢిల్లీ లోని ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది. 5 సంవత్సరాల ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె పొరుగు ఇంట్లో ఉండే యువకుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఈ పైశాచికానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ బయటికి వచ్చిన పాపను చూసి స్థానికులు ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ మ‌హిళా క‌మీష‌న్ చైర్ ఫర్సన్ స్వా‌తీ మ‌లైవాల్ చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ