టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుసగా విన్నపాలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు ఓవైపు ఫేస్ బుక్ లో, మరోవైపు ట్విట్టర్లో ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా కొనసాగొద్దంటూ వేడుకుంటున్నారు. 'రియల్ ఎస్టేట్ సంస్థ 'ఆమ్రపాలి'కి బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండకూడదు' అంటూ.. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీ వాసులు సామాజిక మాద్యమం ద్వారా ధోనీకి విన్నవించుకున్నారు.
నోయిడా సెక్టర్ 45లోని 'షప్పైర్' ప్రాజెక్టు కొత్తగా నిర్మించిన ప్లాట్లలో 800 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించిన పూర్తి సౌకర్యాలు కల్పించడంలో ఆ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యుత్, సివిల్ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ఆ హౌసింగ్ సొసైటీ వాసులు నిరసనకు దిగారు. ఆన్లైన్లో ఆ సంస్థకు వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికి ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించకూడదని కూడా సామాజిక వేదిక ద్వారా విజ్ఞప్తులు చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో.. సదరు కంపెనీ దిగొచ్చింది. వారి పెండింగ్లో ఉన్న ప్లాట్ల పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది.