పాక్ క్రికెట్ బోర్డులో నెలకొన్న పంచాయతీ తీరే టైం దగ్గర పడిందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఐసీసీ ముందుకు చేరినట్టు ఆయన తెలిపారు. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ తో పాటు ఐసీసీ కూడా తమకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది. అయితే భారత్ లో ఈ సిరీస్ ను కొనసాగించాలని, పాక్ ఆటగాళ్లకు అవసరమైన భద్రతను బీసీసీఐ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించని పీసీబీ, తటస్థ వేదికపై మ్యాచ్ లు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఐసీసీ ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోబోదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వివాదం ఐసీసీ చెంతకు చేరింది. మరి ఐసీసీ ఏం చెబుతుందో అనే అసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.