యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ (346 బంతుల్లో 25 ఫోర్లు, సిక్సర్తో 215) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 337/1తో రెండో రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 566/8 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టపాటపా వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో రోజు ఆట చివరకు 85 పరుగులతో నిలిచింది. కెప్టెన్ కుక్ (21 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (38) క్రీజులో ఉన్నారు. ఆడమ్ లిత్ (0)ను ఇన్నింగ్స్ రెండో బంతికే స్టార్క్ డకౌట్ చేయగా, బ్యాలెన్స్ (23), జో రూట్ (1)ను జాన్సన్ అవుట్ చేశాడు. ఇయాన్ బెల్ (1)ను హాజెల్వుడ్ పెవిలియన్ చేర్చాడు. కాగా, మొదటి రోజు మూడు సెషన్లలో ఒకే వికెట్ తీసిన ఇంగ్లండ్ బౌలర్లు కోలుకున్నారు. తొలిసెషన్ ఆరో ఓవర్లోనే ఓవర్నైట్ బ్యాట్స్మన్ క్రిస్ రోజర్స్ (173)ను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. దీంతో 284 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై ఆతిథ్య బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తున్నా.. స్మిత్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో రెండో మ్యాచ్ దాదాపు ఆస్ట్రేలియా చేతికే దక్కేట్లుగా ఉంది.