బీసీసీఐ తో ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసించిన బాస్ శ్రీనివాసన్ భవితవ్యం ఏంటో నేడు తేలనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పదవిలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఆయన తర్వాత చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో అల్లుడు గురునాథ్ మెయెప్పన్ పాత్రతో ప్రతిష్ట మసకబారిపోయి బీసీసీఐ పదవిచ్యీతుడుగా మారాడు. అంతేకాదు అప్పటిదాకా అందరిలో ఆయనపై ఉన్న గౌరవం ఒక్కసారిగా పోయింది. బోర్డులో కూడా ఆయన బలహీనమయిపోయారు. చివరికి ఆరోపణలు సుప్రీంకోర్టు తలుపును తట్టడంతో బీసీసీఐ పీఠం దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఓవైపు ఛీత్కారాలు ఎదురవుతున్నా, ఐసీసీ చైర్మన్ పదవిలో మాత్రం ఇంకా కొనసాగుతున్నారు.
దీనిపై కూడా కన్నేసిన బీసీసీఐ ఆయనను పదవి నుంచి తొలగించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది కూడా. బీసీసీఐ ప్రతినిధిగా కొనసాగుతున్న ఆయనను ఎలాగైనా సాగనంపేందుకు బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈమేరకు నేడు ముంబైలో బీసీసీఐ ఏజీఎం సమావేశమవుతోంది. ఈ సమావేశంలో శ్రీని తమ ప్రతినిధి కాదని ఐసీసీకి తేల్చిచెప్పే దిశగా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. తద్వారా ఆయన పదవి పోవటమే కాదు, ఇప్పుడున్న సభ్యుల్లో ఎవరైనా ఆ పీఠం ఎక్కోచ్చు. అయితే శశాంక్ మనోహార్ కన్నే ఐసీసీ పీఠంపై ఉందని, అందుకే ఇలా చేస్తున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో ఈరోజు జరిగే ఏజీఎంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.