పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ తన బుద్ధిపోనిచ్చుకోలేదు. బౌలింగ్ లో చకింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావటంతో ఐసీసీ అతనిపై నిషేధం విధించింది. అంతేకాదు అటు పీసీబీ కూడా అతనిపై వేటు వేసింది. దీంతో ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా భారత స్పిన్నర్లపై అనుచిత కామెంట్లు చేశాడు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుళ్లును వెల్లగక్కాడు.
టాప్ స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ ల బౌలింగ్ శైలి తనకు అనుమానంగా ఉందని ఆరోపించాడు. వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని, వారి బౌలింగ్ యాక్షన్ ను గమనిస్తే ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. ముఖ్యంగా బజ్జీ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని చెయ్యి మాములు కోణంకన్నా 15 డిగ్రీలు ఎక్కువ వంగుతుందని, ఇది ఖచ్ఛితంగా చకింగే అని ఆరోపిస్తున్నాడు. తనపై వేటు వేసిన ఐసీసీ వారి విషయంలో మాత్రం ఉదారతను ప్రదర్శిస్తుందన్నాడు. చకింగ్ ద్వారా వేటుపడిన అజ్మల్ ఇతరులపై ఇలా కామెంట్లు చెయ్యటం మంచిది కాదని పలువురు సీనియర్లు చెబుతున్నారు. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.