ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు మ్యాచ్ నాగ్ పూర్లో బుధవారం ప్రారంభమైంది. 27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లను కోల్పోయి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ (11), ఛటేశ్వర్ పుజారా(18) పరుగులతో ఉన్నారు.
టీమిండియా బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డీన్ ఎల్గర్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (12) ఎల్గర్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. మోర్గల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్ఫిన్నర్లు, ఒక పేసర్తో బరిలోకి దిగింది. వరుణ్ ఆరోన్, రోజర్ బిన్నీ స్ధానంలో రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాలకు చోటు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తొలి టెస్టులో టీమిండియా నెగ్గినా, బెంగుళూరు టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. నాగ్పూర్లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్లో విజయం సాధించి సిరిస్ను దక్కించుకోవాలనే పట్టుదలతో కోహ్లీ సేన ఉంది.