పరాజయంలోనూ సఫారీల రికార్డు మోత

December 07, 2015 | 04:19 PM | 4 Views
ప్రింట్ కామెంట్
india-won-freedom-test-series-with-3-safari-niharonline

నాలుగు టెస్టుల సిరీస్ లో రెండవ టెస్టు వర్షార్పణం కాగా, మిగిలిన మూడు టెస్టులనూ గెలుచుకున్న భారత జట్టు 3-0 తేడాతో మండేలా - గాంధీ ఫ్రీడమ్ సిరీస్ ను సగర్వంగా చేతుల్లోకి తీసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ని ఎలాగైనా డ్రాగా ముగించాలని చూసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పప్పులు, భారత బౌలర్ల ముందు ఉడకలేదు. రెండవ ఇన్నింగ్స్ లో 143.1 ఓవర్లలో 143 పరుగులు చేసి సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మరో 18.5 ఓవర్ల పాటు ఆడివుంటే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ ప్రధాన ఆటగాళ్ల పతనం తరువాత ఆ జట్టు నిలదొక్కుకోలేకపోయింది. భారత బౌలర్లలో అశ్విన్ 5, యాదవ్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. ఇక పరాజయంలోనూ సఫారీలు చాలా రికార్డులే నెలకొల్పారు. చెత్త రికార్డుల మోతతో అదరగొట్టింది.

                                  ఆడిన గత 15 సిరీస్ లలో సౌతాఫ్రికా ఓటమిని చవిచూడలేదు. ఇప్పుడు భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఆ జట్టు కాపాడుకుంటూ వచ్చిన ఈ రికార్డు మన స్పిన్నర్ల దెబ్బకు గల్లంతయింది.  కనీసం 200 బంతులాడిన ఆటగాళ్లలో అతి తక్కువ స్ట్రయిక్ రేటును హసీమ్ ఆమ్లా సాధించి ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 244 బంతులాడిన ఆమ్లా చేసింది 25 పరుగులే. అతని తరువాత ఇంగ్లండ్ ఆటగాడు రసెల్స్ ఉండగా, మూడవ స్థానంలో నేడు అత్యంత జిడ్డు ఆట చూపిన డివిలియర్స్ నిలిచాడు. ఓ టెస్టు మ్యాచ్ లో తొలి 50 ఓవర్లకు దక్షిణాఫ్రికా చేసిన 49 పరుగులే అత్యల్పం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2005లో జరిగిన ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ స్కోరు 68 పరుగులు.  దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన మ్యాచ్ లలో నాలుగో ఇన్నింగ్స్ కు అత్యధిక పలుగుల టార్గెట్ ఢిల్లీ మ్యాచ్ లోని 481 పరుగులు. టెస్టుల్లో భారత్ పై డుమినీ సరాసరి 10.62. డుమినీకి సంబంధించినంత వరకూ ఇదో చెత్త రికార్డే. మరే దేశంలోనూ డుమినీ ఈ 'ఘనత' సాధించలేదు. ఇక అత్యధిక సేపు ఆడి అతి తక్కువ పార్ట్ నర్ షిప్ లో తొలి మూడు రికార్డులూ ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా పేరిట చేరిపోయాయి. ఆమ్లా, డెవిలియర్స్ 27 పరుగులు, డెవిలియర్స్, ప్లెసిస్ 35 పరుగులు, ఆమ్లా, బవుమా 44 పరుగులు టాప్ - 3 (కనీసం 200 బంతులు)లో ఉన్నాయి.

ఇక భారత్ తరపున కూడా కొన్ని బెస్ట్ రికార్డులు నమోదయ్యాయి. ఓ టెస్టులో 5వ నంబర్ కన్నా దిగువన బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు రహానే. అంతకుముందు 2008 అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ 259 పరుగులు చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో పాటు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, రహానే 227 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు.  ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక మెయిడెన్లు వేసిన టాప్-10 జాబితాలో జడేజా చేరిపోయాడు. 46 ఓవర్లు వేసిన జడేజా వాటిల్లో 33 మెయిడెన్లు వేయడం గమనార్హం.  ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన 5వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కన్నా ముందు విజయ్ హజారే, గవాస్కర్, ద్రవిడ్, కోహ్లీలు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. .  ఇక బెస్ట్ ఎకానమీ బౌలర్ గా వరల్డ్ నంబర్ 2 స్థానంలో జడేజా నిలిచాడు. సౌతాఫ్రికా పై 46 ఓవర్లు వేసిన జడేజా కేవలం 26 పరుగులే ఇచ్చాడు. అతని కన్నా ముందు 1964లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 32 ఓవర్లు వేసిన నద్ కర్ణీ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ