భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాలేలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కౌశాల్ సిల్వ, కరుణ రత్నేలు ఆరంభించారు. అయితే ప్రారంభమైన కాసేపటికే లంక కష్టాలు పడుతోంది. ఓపెనర్లు ఇద్దరు కరుణ 9, కౌశాల్ 5 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం లంక 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. ఇషాంత్, ఆరోన్ లు తలో వికెట్ తీశారు. సంగక్కర, తిరిమన్నెలు క్రీజ్ లో ఉన్నారు.
కాగా, టీమిండియా తుది జట్టులో శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, అమిత్ మిశ్రా, ఆరోన్, ఇషాంత్ శర్మ లు ఉన్నారు. లంక టీంలో కౌశల్, సంగక్కర, కరుణరత్నే, మాథ్యూస్, తిరిమన్నే, చండిమల్, ముబారక్, కౌశల్ తదితరులు ఉన్నారు.
శ్రీలంక గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయం సాధించి 22 ఏళ్లయ్యింది. పైగా సొంతగడ్డపై ఇటీవలే పాకిస్థాన్ చేతిలో ఓడిన ఒత్తిడిలో లంక ఉంది. కాబట్టి టెస్టు సిరీస్ నెగ్గేందుకు భారత్కిదే గొప్ప అవకాశం. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉన్న ట్టు వాతావరణ శాఖ సమాచారం. ఈ మ్యాచ్ ఫలితం తేలాలంటే వరుణుడు కరుణించాల్సిందే.