ప్రస్తుతం జరుగుతున్న సఫారీ టూర్ లో పిచ్ వ్యవహారం ఎంత రచ్చ రేపుతుందో తెలిసిన విషయమే. ముఖ్యంగా కీలకమైన ఆఖరి వన్డేలో క్యూరేటర్ తయారు చేసిన పిచ్ పై జట్టు మేనేజర్ రవిశాస్త్రి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో సదరు క్యూరేటర్ ఫిర్యాదు చేసిన బీసీసీఐ కాస్త గరం అయింది. దీంతో రాబోయే మ్యాచ్ ల వ్యవహారంపై ఆచీతూచీ వ్యవహరించాల్సిందిగా ఓవైపు క్యూరేటర్లకు, మరో వైపు రవికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.
దీంతో మొహాలీ పిచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దక్షిణాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్టుకు మంచి స్పోర్టింగ్ వికెట్ను తయారుచేసినట్టు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) కార్యదర్శి ఎంపీ పండావ్ తెలిపారు. ప్రారంభంలో పేసర్లు రాణించినా ఆ తర్వాత స్పిన్నర్లు కీలకమవుతారని చెప్పారు. ‘మా శాయశక్తులా మంచి క్రికెటింగ్ వికెట్ను రూపొందించేందుకు ప్రయత్నించాం. బ్యాట్స్ మెన్తో పాటు బౌలర్లకు కూడా లాభించేలా ఉంటుంది. పిచ్ అవుట్ ఫీల్డ్ పూర్తి పచ్చికతో ఉంది. కచ్చితంగా ఇక్కడ అభిమానులకు చక్కటి క్రికెట్ వినోదం లభిస్తుంది’ అని పాండోవ్ తెలిపారు.
దక్షిణాఫ్రికా జట్టు 1న మొహాలీకి చేరుకోనుంది. అదే రోజు ఢిల్లీలో హర్భజన్ వివాహ విందు ఉండడంతో భారత్ ఆటగాళ్లు మర్నాడు రానున్నారు. 5 నుంచి 9 వరకు మ్యాచ్ జరుగుతుంది. అయితే టిక్కెట్ల అమ్మకాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీటి రేట్లను తగ్గిస్తే టెస్టులను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తారని పాండోవ్ అభిప్రాయపడ్డారు. విమర్శలు తావులేకుండా తాము పిచ్ రూపొందించామని ఆయన చెప్పుకొచ్చారు.