భారత్ తో క్రికెట్ సిరీస్ ఉంటుందో ఉండదో స్పష్టత లేని టైంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు టెన్షన్ పట్టుకుంది. ఓవైపు ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవటంతోపాటు సిరీస్ నిర్వహాణ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన పీసీబీ ని బాగుచేసుకునేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఓవైపు దుశ్చర్యలకు పాల్పడుతూ పౌరుల ప్రాణాలు తీస్తూ మరోవైపు ఆట అంటే ఎలా ఒప్పుకుంటారు. అందుకే తటస్థ వేదిక అన్న ఆప్షన్ కూడా లైట్ తీసుకుని నిర్ణయాన్ని పక్కన పెట్టి వేరే దేశాలతో వరుస సిరీస్ లు ఆడిస్తూ వస్తుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో బుధవారం పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కి లేఖ రాసింది. ద్వైపాక్షిక సిరీస్పై స్పష్టత ఇవ్వాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. వచ్చే డిసెంబర్లో నిర్వహించాల్సిన సిరీస్పై భారత్ అభిప్రాయాన్ని కోరింది. అసలు సిరీస్ ఉంటుందో... ఉండదో తెలపాలని ఆ లేఖలో పేర్కొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ డిసెంబర్లో ఇండియా-పాక్ ల మధ్య జట్లు రెండు టెస్ట్ లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే భారత్ నిర్ణయాన్ని పక్కనబెట్టడంతో పాక్ ఎటూ తోచని పరిస్థితి నెలకొంది. ఆదాయం భారీగా రావాలంటే భారత్ తో ఆడాల్సిన పరిస్థితి తప్పనిసరి ఈ నేపథ్యంలో ఇంతకాలం వేచి చూసింది. భద్రతకు భరోసా అని కూడా చెప్పేసింది. కానీ టైం దగ్గర పడుతున్నా స్పందన లేకపోవటంతో ఇక పీసీబీ కి బెంగపట్టుకుంది. ఐసీసీ ని రంగంలోకి దించి పని కానిచ్చుందామనుకుంటే వారు కాస్త సారీ చెప్పేశారు. ఇక రాజకీయంగా ఏమైనా ప్రభావం ఉంటే తప్పా భారత్ పాక్ సిరీస్ ఉండేది అనుమానమే. ఆ వైపు నరుక్కొచ్చే విధంగా పాక్ ప్రయత్నించాలే గానీ ఇలా ఉంటుందా ఉండదా అంటూ సీరియస్ లేఖలు రాస్తే కామెడీగా బీసీసీఐ ‘నో’ అనే చెప్పినా చెప్పోచ్చు.