వైజాగ్ క్రికెట్ స్టేడియంకు కొత్త కళ సంతరించుకోనుంది. ఐపీఎల్-9 సీజన్ లో మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఆడే మూడు మ్యాచ్లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో ఊపందుకుంది.
దీంతో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు సొంత మైదానాల్లో ఆడాల్సిన మ్యాచ్ల కోసం వేదికలను వెతకడం ఆరభించాయి. అయితే ముంబైకి జైపూర్ ఫైనలైజ్ కాగా, వైజాగ్ వైపు పుణే ఆసక్తి చూపింది. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కూడా అత్యవసర సమావేశం నిర్వహించి మ్యాచ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ మూడు మ్యాచ్లకు మొదటిసారిగా స్పైడర్ కెమెరాను వినియోగించనున్నారు. ఇటువంటి కెమెరాను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ధోనీ నాయకత్వంలోని పుణె జట్టు మే 10న సన్రైజర్స్, 17న ఢిల్లీ డేర్డెవిల్స్, 21న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో ఇక్కడ ఆడనుంది.