టీమిండియాలో ముసలం ప్రారంభమైంది. టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రిలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీనియర్లు వారి వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీలాంటి దిగ్గజాలు వారి తీరును తప్పుబట్టగా, తాజాగా సంజయ్ మంజ్రేకర్ కూడా ఆ జాబితాలో చేరారు. కోహ్లీ, రవిశాస్త్రిలు నమ్ముతున్న దూకుడు మంత్రం తనకు ఆందోళన కలిగిస్తోందని మంజ్రేకర్ చెప్పాడు. కోహ్లి-శాస్త్రిల భాగస్వామ్యం తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆస్ట్రేలియాలోనే మన జట్టు ప్రవర్తన దిగజారిందన్నాడు. ఇక అక్కడి నుంచి ప్రవర్తన మార్చుకునే ప్రయత్నలేవీ జరగట్లేదని ఆయన అన్నాడు.
శ్రీలంక సిరీస్ లో జరిగిన గొడవలె ఇందుకు నిదర్శమని చెప్పారు. ఇలా ప్రవర్తించడం తప్పని, దాన్ని సరిదిద్దాలని జట్టులో ఎవరికీ అనిపించడం లేదని వాపోయాడు. దూకుడైన క్రికెట్ అని ఏదో కొత్త జపం చేస్తున్నారని, అది సరికాదన్నాడు. ఈ రకం క్రికెట్ జట్టులోని ముఖ్య ఆటగాడిని ఓ కీలకమైన మ్యాచ్కు దూరం చేసిందన్నాడు. దూకుడుగా ఆడటం వల్లే శ్రీలంకపై సిరీస్ గెలిచామని అంటే... అదే దూకుడు ఆస్ట్రేలియాలో ఎందుకు విజయాన్ని ఇవ్వలేదో చెప్పాలన్నాడు. ఇషాంత్ అవసరం లేకున్నా శ్రీలంక ఆటగాళ్లతో అమర్యాదకరంగా ప్రవర్తించాడన్నాడు. బౌలర్ కొంచెం తన ఆవేశాన్ని, అసహనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందని, అయితే శ్రీలంక జట్టు పైన ఇషాంత్ ప్రదర్శించిన దూకుడుకు అలాంటి కారణమేమీ ఉన్నట్లు కనిపించలేదన్నాడు. ఇషాంత్కు జట్టు ఎన్నో అవకాశాలిచ్చిందని, అలాంటి జట్టుకు చాలా అవసరమైన స్థితిలో అందుబాటులో లేకుండా పోయాడని, ఫాంలో ఉన్న అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్ తొలి మ్యాచ్కు దూరమయ్యాడని మంజ్రేకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.