భారత జట్టును ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య బౌలింగ్. మంచి బౌలర్లు ఉన్నప్పటికీ వారిని రాటుదేల్చటం ఎవరి వల్ల కావటం లేదు. దీనికి తోడు వారు తరచూ గాయలకు గురవ్వటం, వారి స్థానే కొత్తవారు రావటం, వెరసి తొందరగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పేసే స్థితికి చేరుకుంటున్నారు. దీంతో భారత్ కు మంచి బౌలింగ్ కోచ్ ను నియమించాలన్న డిమాండ్ ఇప్పుడు లేవనెత్తుతున్నారు. జూన్ లో జింబాబ్వే టూర్ కన్నా ముందే ఈ నియమకం ఉందని సంకేతాలు బీసీసీఐ అందజేసింది. ధోనీ, ద్రావిడ్ లాంటి వాళ్లు జహీర్ ఖాన్ ను ప్రతిపాదిస్తుంటే, క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్ గా, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డానియల్ వెట్టోరీ అయితే బాగుంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ కు కోచ్ గా వెట్టోరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వెట్టోరీ పనితీరును దగ్గర నుంచి చూసిన కోహ్లీ, జట్టు కోచ్ పదవికి సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 2014లో ధోనీ టెస్టు క్రికెట్ కు పదవీ విరమణ ప్రకటించిన తరువాత కోహ్లీ టెస్టు జట్టు కెప్టెన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు నుంచే వెట్టోరీతో కోహ్లీకి మంచి పరిచయం ఉంది. జూన్ నుంచి మార్చి 2017లోపు భారత్ 18 టెస్టు మ్యాచ్ లను ఆడాల్సి వుండటంతో, ఏ క్షణమైనా భారత కోచ్ ని నియమిస్తారని తెలుస్తోంది. అయితే, కోహ్లీ సిఫార్సు చేసిన వెట్టోరీ విషయంలో బీసీసీఐ ఎంత సీరియస్ గా ఉందన్న సంగతి తెలియాల్సివుంది.