ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో భాగంగా అమెరికా నగరం హూస్టన్ లో జరుగుతున్న రెండో టీ20లో సచిన్ సేన వార్న్ టీం చేతిలో మళ్లీ ఓడిపోయింది. ముందుగా మ్యాచ్ లో టాస్ గెలిచిన సచిన్ బ్లాస్టర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ బ్యాట్స్ మన్ వీరవిహారం చేశారు. సంగక్కర మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 262 భారీ స్కోర్ చేసింది. ప్రత్యర్థి సచిన్ బ్లాస్టర్స్ కు 263 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
వార్న్ ఓపెనర్లు హెడెన్ (32), వాన్ (30) శుభారంభాన్నివ్వగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కలిస్ (41), పాంటింగ్ (40) కూడా బ్యాట్లను ఝుళిపించారు. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక స్టార్ కుమార్ సంగక్కర (70) బ్లాస్టర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. చివరాఖరులో సైమండ్స్ (19), జాంటీ రోడ్స్ (18)కూడా తక్కువ బంతుల్లోనే వేంగంగా పరుగులు రాబట్టారు. వెరసి నిర్ణీత 20 ఓవర్లలోనే వార్న్ వారియర్స్ 262 పరుగులు చేసింది.
ఇక తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సచిన్ బ్లాస్టర్స్ మొదటి నుంచే పోటీ ఇవ్వలేకపోయింది. సెహ్వాగ్ రెండు సిక్సర్లు బాది ఊపు మీద ఉన్నట్లు అనిపించి 16 పరుగులకు అజిత్ అగార్కర్ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ సచిన్ 33 పరుగులతో రాణించాడు. గంగూలీ 12, లారా 19, జయవర్థనే 5, లాన్స్ క్లూస్ నర్ 21, షోయబ్ అక్తర్ 0, స్వాన్ 22, ఇలా అంతా తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. ఒక్క షాన్ పొల్లాక్ మాత్రమే 55 పరుగులతో రాణించాడు. అండ్రూ సైమండ్స్ నాలుగు వికెట్లు తీసి సచిన్ టీంను కొలుకోలేని దెబ్బ తీశాడు. చివరికి లక్ష్య చేధనలో తడబడిన బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-2తో షేన్వార్న్ సారథ్యంలోని వార్న్ వారియర్స్ కైవసం చేసుకుంది. ఇక చివరి టీ20 మ్యాచ్ నవంబరు 14న లాస్ ఏంజిల్స్ లో జరగనుంది.