ఆటతోపాటు మనోళ్లు ఎంటర్ టైన్ మెంట్ కావాలని కోరుకుంటారు. అందుకే భారత క్రికెటర్లు ఏదేశ టూర్లకి వెళ్లినా గర్ల్ ఫ్రెండ్ నో... సతీసమేతంగానో వెళ్తుంటారు. అలా అయితేనే రి ప్రెష్ మెంట్ అయి బాగా రాణిస్తారట. అందుకు తగ్గట్లు బీసీసీఐ కూడా అనుమతి ఇవ్వటంతోపాటు ఏర్పాట్లు చెయ్యటం కూడా ప్రతీసారి పరిపాటే. అయితే ఇటీవల వైఫల్యాలు బీసీసీఐకి బాగా కాలేలా చేసింది. దీంతో తర్వాతి పర్యటనకు కాస్త కఠిన నిర్ణయాన్నే అమలు చెయ్యాలని బోర్డు నిర్ణయించింది.
త్వరలో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనకు భారత క్రికెటర్లు సతి, సఖి లేకుండానే వెళ్లనున్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం మూడు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నెల 12న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొదలవుతుంది. కాగా, ఈ టూర్లో క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ఆటగాళ్లకు దాదాపు నెలరోజులు విశ్రాంతి లభించింది. దీంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు తగిన సమయం దొరికిందని బోర్డు భావిస్తోంది. అలాగే ప్రధాన కోచ్, టీమ్ డైరెక్టర్ లేకుండానే టీమిండియా లంక పర్యటనకు వెళ్లనుంది. ఫ్లెచర్ తర్వాత చీఫ్ కోచ్ను ఇంకా నియమించలేదు. ఇక ప్రస్తుత టీమ్ డైరెక్టర్ రవిశాస్ర్తి యాషెస్ సిరీస్కు కామెంటేటర్గా ఉన్నాడు. విరహవేదనలో కూడా మనోళ్లు రాణించగలిగితే ఈ ప్లాన్ కంటిన్యూ చెయ్యాలని బోర్డు భావిస్తుందట. తట్టుకోగలరా మన ఆటగాళ్లు?