బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జగ్మోహన్ దాల్మియా వారసుడిని ఎన్నుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎమ్) ఆదివారం నిర్వహించనున్నా రు. ‘వచ్చే నెల 4న ముంబైలో ఎస్జీఎమ్ను నిర్వహించనున్నాం. శనివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంద’ని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపాడు. ఒకవేళ ఎన్నికలు జరిగితే మనోహర్కే తమ మద్దతు అని దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వామప్ టీ-20కి హాజరైన ఠాకూర్ తెలిపాడు.
ఎస్జీఎమ్లో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ను ఓటు వేసేందుకు మాత్రమే అనుమతిస్తామన్నాడు. అయితే బోర్డు సమావేశాలకు శ్రీని హాజరయ్యే విషయమై బీసీసీఐ రిట్ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. బోర్డు సమావేశానికి శ్రీనివాసన్ హాజరుకాలేడని, అయితే ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎటువంటి అడ్డంకులూ లేవని ఠాకూర్ తెలిపాడు. 2008-11 వరకు బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ అభ్యర్థిత్వాన్ని క్యాబ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రతిపాదించే అవకాశం ఉంది. శరద్ పవార్-ఠాకూర్ వర్గం మద్దతు ఉన్న మనోహర్కు మొత్తం 29 ఓట్లలో 20 దక్కే చాన్సుంది. దీంతో మరోసారి బోర్డు పగ్గాలను శశాంక్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.