మొదటి టెస్ట్ ఓటమితో కసి పెంచుకున్న భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అశ్విన్, అమిత్ మిశ్రాల దెబ్బకు ఆఖరి రోజు ఆట ఏకపక్షంగా జరగటంతో విజయతీరాలకు సులువుగా చేరింది. రెండో టెస్ట్ లో భారీ స్కోర్ తేడాతో లంక పై జయకేతనం ఎగురవేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 325/8 డిక్లేర్ చేసింది. ఇక లంక మొదటి ఇన్నింగ్స్ లో 306 రన్స్ చేసింది. 413 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 72/2 ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు బ్యాటింగ్ ఆరంభించిన లంక 62 పరుగులకే మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ భారత్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. వచ్చిరాగానే పేసర్ ఉమేష్ యాదవ్ లంక కెప్టెన్ మాథ్యూస్ ను పెవిలియన్ పంపాడు. ఇక ఆతర్వాత వికెట్లు టపటపా రాలడం ప్రారంభమయ్యింది. అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 42 పరుగులిచ్చాడు. ఇక మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా 3 వికెట్లు తీశాడు. దీంతో భారత్ 278 పరుగుల ఆధిక్యంతో గెలిచినట్లయ్యింది. మూడు టెస్ట్ ల సిరీస్ లో 1-1 తో సమానంగా నిలిచాయి. మొదటి టెస్ట్ లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక కీలకమైన మూడో టెస్ట్ ఆగష్టు 28 నుంచి ప్రారంభమౌతుంది.