ఇటీవల జింబాబ్వే సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్సీ వహించాడు అజింక్య రహానే. అసలు ఆ సిరీస్ కి ప్రాతినిధ్యం వహించాల్సింది సురేష్ రైనానట. కానీ, బోర్డు రైనాను పక్కనబెట్టి రహానే కు ఛాన్స్ ఇఛ్చిందని తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. దీనికి గల కారణం అందరినీ విస్మయపరుస్తుంది కూడా. రైనాను కెప్టెన్ గా ఎంపిక చేయకపోవడానికి కారణం లలిత్ మోదీ అట. ఆయన వ్యవహారం పార్లమెంటును ఏ రేంజ్ లో కుదిపేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన దాటికి రైనా కూడా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ మధ్య ఐపీఎల్ స్కాంకి సంబంధించి ట్విట్టర్ లో ఓ ట్వీట్ ట్వీటాడు. అందులో స్కాంలో రైనా, అశ్విన్, విండీస్ ప్లేయర్ డావిన్ బ్రేవో పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తదేనని బీసీసీఐ తన విచారణ కమిటీ ద్వారా తేల్చింది. అయినప్పటికీ పేరు బయటికి వచ్చిందన్న ఒకేఒక కారణంతో ఈ స్టార్ ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడానికి నిరాకరించిందట. అర్థం పర్థం లేని ఆరోపణలను ఆధారంగా చేసుకుని బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రస్తుతం విమర్శలు వినిపిస్తున్నాయి.