మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో బ్యాట్స్ మెన్ ఛటేశ్వర పుజారా సెంచరీతోపాటు, స్పిన్నర్ అమిత్ మిశ్రా అర్థ సెంచరీ సాధించడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. టాపార్డర్ విఫలమవ్వటంతో 180 కి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీం ను వీరిద్దరు ఆదుకున్నారు... లంకను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా మిశ్రా స్టార్ బ్యాట్స్ మెన్ కు తీసిపోని విధంగా సొగసైన షాట్లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకోవటంతోపాటు ఎనిమిదో వికెట్ కి పుజారా తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 500 పరుగుల క్లబ్ లో చేరాడు కూడా. కానీ, ఆట చివర్లో హెరాత్ బౌలింగ్ లో స్టంప్ అవుటయి వెనుదిరిగాడు. ఇక సెంచరీతో ఆదుకున్న పుజారా 277 బంతుల్లో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ఇషాంత్ శర్మ 2 పరుగులతో ఉన్నాడు. మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి భారత్ 292 పరుగులు సాధించింది.