పర్యటన ఆసాంతం తమ ప్రదర్శన ఆకట్టుకున్నా... చివరి టీ20 మ్యాచ్ లో ఓటమి చెందడం నిరాశ కలిగించిందని భారత జట్టు కెప్టెన్ అంజిక్య రహానే తెలిపాడు. జింబాబ్వే సిరీస్ ఆద్యంతం జట్టు ప్రదర్శన చాలా మెరుగ్గా ఉందని, బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ టీంమిండియా బాగా రాణించిందని రహానే అన్నాడు. కాగా, ఆదివారం రెండో టీ20 లో భారత్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్వల్ఫ లక్ష్యం చేధించదగిందే అయినా మేము విఫలమయ్యాం అని రహానే చెప్పుకొచ్చాడు. కానీ, ఓవరాల్ గా చూసుకుంటే మూడు వన్డేలు, రెండు టీ 20ల్లో టీమిండియా ఆశించిన మేర రాణించిందని చెప్పాడు. పర్యటనలో రాయుడు, జాదవ్ లు సెంచరీలు సాధించటంతోపాటు తాను, మురళీ విజయ్ లు హాఫ్ సెంచరీలు సాధించి విజయాల్లో కీలకపాత్ర పోషించామని తెలిపాడు. రెండో టీ20 కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదని చెప్పాడు.