భారత్ దెబ్బకు బంగ్లా బేబీలు బౌల్డ్

March 19, 2015 | 05:13 PM | 38 Views
ప్రింట్ కామెంట్
india_victory_on_bangladesh_and_enters_semis_niharonline

భారత్ జైత్రయాత్రకు ఎదురేలేదు. టీమిండియా దూకుడును ఆపే ప్రత్యర్థే లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్ పోరుకు కూతవేటు దూరం చేరుకుంది.  ప్రపంచ కప్ లో టీమిండియా సునాయసంగా సెమీస్ పోరుకు దూసుకెళ్లింది. గురువారం ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ధోనీసేన 109  పరుగులతో బంగ్లాదేశ్‑పై విజయం సాధించింది. రోహిత్ వీరోచిత సెంచరీకి తోడు భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో బంగ్లా పోటీనివ్వలేకపోయింది. 303 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను భారత బౌలర్లు 45 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ చేశారు. బంగ్లా జట్టులో నాసిర్ హొస్సేన్ (35) టాప్ స్కోరర్.  టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. ఉమేష్ నాలుగు, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఓపెనర్లు తమీమ్, ఇమ్రుల్ కేస్ జట్టు స్కోరు 33 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత పేసర్ ఉమేష్ యాదవ్.. తమీమ్‑ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ వెంటనే ఇమ్రుల్‑ను రనౌట్ చేశారు. అయినా బంగ్లా 73/2తో పోరాటం కొనసాగించింది. ఈ సమయంలో షమీ వెంటవెంటనే మహ్మదుల్లా, సౌమ్యా సర్కార్‑ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లా కోలుకోలేకపోయింది. మహ్మదుల్లా క్యాచ్‑ను ధావన్ అద్భుతంగా పట్టుకున్నాడు. కాసేపటికే జడేజా బౌలింగ్‑లో షకీబల్ అవుటయ్యాడు. ఆ తర్వాత రహీం, నాసిర్, సబ్బీర్ రహ్మాన్  పోరాడినా జట్టును విజయం దిశగా నడిపించలేకపోయారు. బంగ్లా ఓటమిని కాసేపు ఆలస్యం చేశారంతే. రహ్మాన్‑ను ఉమేష్ అవుట్ చేయడంతో బంగ్లా కథ ముగిసింది. శుక్రవారం ఆసీస్, పాక్ ల మధ్య జరిగే మరో క్వార్టర్ ఫైనల్ విజేతే భారత్ కు సెమీస్ ప్రత్యర్థి అవుతుంది. ఆ టీంతో 26న సిడ్నీలో భారత్ తలపడనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ