తెలంగాణ రాజకీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయనపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఒకనొక టైంలో అధినేత చంద్రబాబు కూడా తలసాని వ్యవహారాన్ని లేవనెత్తారు. కానీ, దానిపై ఇంతవరకు ఎలాంటి సమాధానం అధికార పక్షం నుంచి అందలేదు.
టీఆర్ఎస్ లో చేరి, మంత్రి పదవి అలంకరించారు గానీ పార్టీ ఫిరాయింపుపై ఏనాడూ తలసాని కూడా స్పందించలేదు. ఆ తర్వాత ఈ విషయంపై అనేక విమర్శలు, ప్రతి విమర్శలు రావటంతో స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే, మంత్రి అయ్యాయని ఓ వైపు తలసాని చెబుతున్నారు. స్పీకర్ మధుసూదనాచారే ఇంతవరకు రాజీనామాను ఆమోదించలేదని అంటున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా ఔననే అంటున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది.
కానీ, అసలు జరిగిన విషయమేమిటో టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పటంతోపాటు ఈ వ్యవహారంపై బాంబు పేల్చారు. తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందా? అని మీడియా ప్రతినిధులు గురువారం నాయినిని ప్రశ్నించారు. దీనికి ఆయనిచ్చిన సమాధానం విని షాక్ కి గురవ్వటం మీడియా వంతు అయ్యింది. ఇంతకీ ఆయనేమన్నాడంటే... ఎందుకు వస్తుంది? అసలు తలసాని రాజీనామా చేయలేదు కదా? అని చెప్పారుట. సరదా వ్యాఖ్యో, మరి సీరియసో తలసానే మళ్లీ స్పందిస్తే బెటర్ మరి.